newsseals.com
News

బెదిరింపులకు పాల్పడితే ఇక జైలుకే

Posted by: VijayaBhaskar December 31, 2025
newsseals-MinisterSavitha

ఉక్కుపాదం మోపుతామ‌న్న మంత్రి స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 18 నెలలో కాలంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత స్ప‌ష్టం చేశారు. సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఎక్కడికెళ్లినా కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అయితే, జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు దెబ్బతినేలా రప్పా…రప్పా…అంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉక్కుపాదం మోపుతోందన్నారు.

అంతకు ముందు మోదా పంచాయతీలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి మంత్రి సవిత లబ్ధిదారుల ఇళ్లకు పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలుకరిస్తూ, కుటుంబం కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు అండగా నిలవాలని లబ్ధిదారులను మంత్రి సవిత కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.