newsseals.com
News

స్పీక‌ర్ అయ్య‌న్న‌ను క‌లిసిన ప‌వ‌న్ కళ్యాణ్

Posted by: VijayaBhaskar March 6, 2026
newsseals-PawanKalyan

అభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని శుక్రవారం స్పీకర్ చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి కి సంబంధించిన సమగ్ర నివేదికను స్పీకర్‌ కి ఆయన అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో మొత్తం రూ. 312 కోట్ల నిధులతో 5,628 పనులు మంజూరు కాగా, ఇప్పటికే రికార్డు స్థాయిలో 4,530 పనులు పూర్తయినట్లు పవన్ కళ్యాణ్ ఈ నివేదికలో స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన పల్లె పండుగ, పల్లె పండుగ 2.0, జల జీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గంలో రహదారులు, ఇంటింటికీ త్రాగునీరు, ఇంకుడు గుంతలు, మినీ గోకులాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా జరుగుతోందని డిప్యూటీ సీఎం వివరించారు. కేవలం జల జీవన్ మిషన్, 15వ ఆర్థిక సంఘం ద్వారానే రూ. 173.53 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో పనులు విజయవంతంగా సాగుతున్నాయని, మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.