newsseals.com
News

అరాచ‌క పాల‌న అంత‌మైన రోజు ఇది

VijayaBhaskar June 4, 2026
newsseals-MandippalliRamPrasadReddy
Spread the love

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు ఇది అని పేర్కొన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచి పోతుంద‌న్నారు. అరాచక, విధ్వంసక పాలనకు ప్రజలు శాశ్వతంగా చరమగీతం పాడారన్నారు. వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందిన ఈ దినం ఎప్ప‌టికీ ఎల్ల‌కాలం ఏపీ చ‌రిత్ర‌లో నిలిచి పోతుంద‌న్నారు మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి.

రాష్ట్రాన్ని బందిపోటు దొంగల ముఠాలా నడిపిన పాలనకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పార‌న్నారు. వ్యక్తిగత కక్షలు, వేధింపుల రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలికారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుక బ‌డింద‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు కూటమికి అఖండ మద్దతు ఇచ్చారని చెప్పారు మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టిందని అన్నారు. అమరావతి పునర్నిర్మాణం కూటమి ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమ‌ని పేర్కొన్నారు. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని అన్నారు..