కార్యకర్తల వల్లనే యువ గళం విజయవంతమైంది

సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నారా లోకేష్
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికలకు ముందు చేపట్టిన యువగళం పాదయాత్ర గురించి గురువారం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈసందర్బంగా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల గురించి ప్రశంసలు కురిపించారు. ఆనాడు జగన్ రెడ్డి పాలన కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎక్కడా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో పార్టీ కోసం పని చేశారంటూ కితాబు ఇచ్చారు నారా లోకేష్. ఇదిలా ఉండగా తిరుపతిలో జరిగిన కమ్మ సంక్షేమ, అభివృద్ధి సంస్థ (Kamma Welfare and Development Corporation) చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తన యువగళం పాద యాత్రను గుర్తు చేసుకున్నారు. ‘యువగళం’ పాదయాత్రలో తనతో కలిసి నడిచిన కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. వారితో జరిపిన 15 నిమిషాల సంభాషణలో, ఆ యాత్ర విజయవంతం కావడంలో వారి కీలక పాత్రను ఆయన గుర్తించారు. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ శ్రేణులు ఎదుర్కొన్న అణచివేతను గుర్తుచేసుకుంటూ, పాదయాత్రను విజయవంతం చేసినందుకు కార్యకర్తలను అభినందించారు. ‘కార్యకర్తే నాయకుడు’ అని నమ్మే టీడీపీ, ఎప్పుడూ వారి సాధికారత కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయడం, ఉపాధ్యాయ , కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.