పొగాకు రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి

అమరావతి : ఆరుగాలం కష్టపడి పండించిన పొగాకు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో గత సీజన్తో పోలిస్తే ఈ ఏడాది వేలం ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని తనను కలిసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు. తయారీ దారుల కొనుగోళ్లు తగ్గించటంతో రైతు కూలీలు, వేలం కేంద్రాల కార్మికులు, రవాణాదారులు, ఎంఎస్ఎంఈ రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఈ ఏడాది 230 మిలియన్ కేజీల ఉత్పత్తికిగానూ కేవలం 34 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయన్నారు.
చట్టబద్ధమైన సిగరెట్లు అక్రమ పొగాకు ఉత్పత్తుల మధ్య ధరల వ్యత్యాసం పెరగడం వల్ల, అక్రమ రవాణా పన్ను ఎగవేత కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. తక్షణం పొగాకు రైతులను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. మానవీయ దృక్ఫథంతో తాము ఇప్పటి వరకు పొగాకు రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ మార్కెట్ యార్డ్ లలో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు . భారీ ఎత్తున ఖజానాపై భారం పడుతుందని వాపోయారు.