ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

VijayaBhaskar · December 25, 2025
Spread the love

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో

తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.

ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో భాస్క‌ర నారాయ‌ణ చౌద‌రి, సూపరింటెండెంట్ శేష‌గిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు, అర్చక బృందం పాల్గొన్నారు.