రికార్డు స్థాయిలో శ్రీ‌వారి ల‌డ్డూల విక్ర‌యం

VijayaBhaskar · January 2, 2026
Spread the love

గ‌త ఏడాదితో పోల్చితే 10 శాతం అధికం

తిరుమ‌ల : 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డు స్థాయిలో విక్ర‌యించ‌బ‌డ్డాయి. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది 12.15 కోట్ల‌ ల‌డ్డూల‌ను విక్ర‌యించ‌గా ఈ ఏడాది 13.52 కోట్ల ల‌డ్డూల‌ను టీటీడీ భ‌క్తుల‌కు విక్ర‌యించింది. అంటే గ‌త ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల ల‌డ్డూల‌ను ఈ ఏడాది అద‌నంగా భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం విశేషం. గ‌త ద‌శాబ్ద కాలంలో ఎన్న‌డూ లేని విధంగా 2025 డిసెంబ‌ర్ 27వ తేదిన అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తులు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం.

టీటీడీ గత సంవత్సరం గా ప్ర‌తిరోజూ 4 ల‌క్ష‌ల వరకూ ల‌డ్డూల‌ను త‌యారు చేస్తోంది. ముఖ్య‌మైన రోజుల్లో 8 ల‌క్ష‌ల నుండి 10 లక్షల ల‌డ్డూల వ‌ర‌కు( buffer) భక్తలకు అందుబాటులో ఉంచుతోంది. 700 మంది శ్రీ‌వైష్ణ‌వ బ్ర‌హ్మ‌ణులు శ్రీ‌వారి పోటులో రెండు షిప్టుల్లో 24 గంట‌లు శ్ర‌మిస్తూ నియ‌మ‌, నిష్ట‌ల‌తో స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను త‌యారు చేస్తారు. ఇటీవ‌ల కాలంలో ల‌డ్డూల నాణ్య‌త‌, రుచి పెర‌గ‌డంపై భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. రాబోయే రోజుల‌లో శ్రీ‌వారి ల‌డ్డూలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్ప‌డే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండ‌గా టీటీడీ అనుబంధ ఆల‌యాల‌లో కూడా ల‌డ్డూల‌ను విక్ర‌యిస్తున్నారు.