స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

VijayaBhaskar · February 10, 2026
Spread the love

హంస వాహనంపై భ‌క్త బాంధ‌వుల‌కు ద‌ర్శ‌నం

తిరుప‌తి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు

హంస వాహనసేవలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

వాహ‌న‌సేవ‌లో టీటీడీ జేఈవో వి.వీర‌బ్ర‌హ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌, కంక‌ణ‌బ‌ట్టార్‌ బాలాజి రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.