పండుగ వాతావరణం రథోత్సవ మహోత్సవం

VijayaBhaskar · February 15, 2026
Spread the love

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.45 గం.లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి రథోత్సవ మహోత్సవం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం నాలుగు మాడ వీధులలో మహా వైభవంగా రథయాత్ర సాగింది. రథోత్సవం సందర్భంగా భక్తుల సందడి, విశ్వాసం, ఆనందోత్సాహాలు ప్రత్యేకంగా కనిపించాయి.

గోవిందా… గోవిందా అంటూ నినాదాలు చేస్తూ రథాన్ని లాగిన భక్తులు, తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు. దేవదేవుడి దివ్య దర్శనం కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ర‌థోత్స‌వంలో ఎస్ఇ మ‌నోహ‌రం, ఆలయ ప్రత్యేక అధికారి , సిపిఆర్వో డా. టి.రవి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, వీజీవో సురేంద్ర, ఏఈవో గోపినాథ్‌, కంకణభట్టర్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.