పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి

VijayaBhaskar · February 16, 2026
Spread the love

భ‌క్తుల‌ను అనుగ్ర‌హించిన స్వామి

తిరుప‌తి : తిరుప‌తి లోని శ్రీ కపిలేశ్వర ఆల‌యంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తొమ్మిదో రోజైన సోమ‌వారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు.

కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. 11 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సోమస్కంద మూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం, ప‌న్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌క‌లు,ఇత‌ర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.