ఓట‌ర్ల హ‌క్కుల‌తో చెల‌గాటం ఆప‌కపోతే ఆందోళ‌న

హైద‌రాబాద్ : తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యుయు), తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న స‌ర్ ప్ర‌క్రియ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా ఉంద‌ని మండిప‌డ్డారు. నేను ఇల్లు మార్చలేదు. అయినప్పటికీ నా ఓటును ముందుగా మరో చిరునామాకు మార్చి, ఆ తర్వాత పూర్తిగా తొలగించారు. నేను కొత్త ఓటరు కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఓటు హక్కును వినియోగించాను. మరి ఇప్పుడు నన్ను కొత్త ఓటరిలా ఫారం-6 దరఖాస్తు చేయమని ఎందుకు బలవంతం చేస్తున్నారంంటూ ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శ్నిస్తున్నార‌ని, దీనిపై ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల సంఘం స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు షేక్ స‌లావుద్దీన్.

ఇది నా ఒక్కరి సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిజమైన ఓటర్ల సమస్య అని పేర్కొన్నారు. అక్రమంగా ఓట్లు తొలగించడం కాదు, ప్రతి అర్హత కలిగిన ఓటరి హక్కును రక్షించడం ఎన్నికల వ్యవస్థ బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. ప్రతి ఓటుకు విలువ ఉంది. ప్రతి ఓటరికి సమాధానం చెప్ప‌క పోతే ఎలా అని నిల‌దీశారు స‌లావుద్దీన్. ప్రజాస్వామ్యం ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడినప్పుడే బలపడుతుంద‌ని లేక పోతే రాచ‌రికానికి దారి తీస్తుంద‌ని హెచ్చ‌రించారు షేక్ స‌లావుద్దీన్. అంబర్‌పేట నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు ఓటర్ల హక్కులతో చెలగాటం ఆడుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు లేదా సమ్మతి లేకుండా వారి ఓట్లను మరో ఇంటి చిరునామాకు, మరో పోలింగ్ బూత్‌కు మార్చడం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హరించడమేనంటూ నిప్పులు చెరిగారు.

అంబర్‌పేటలోని ప్రేమ్‌నగర్‌లో తన కుటుంబ సభ్యుల ఓట్లలో కొన్నింటిని అధికారులు ఏకపక్షంగా మరో బూత్‌కు మార్చారని, ఈ మార్పులపై ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు షేక్ స‌లావుద్దీన్. ఓటర్ జాబితా నుంచి పేరు అదృశ్యం కావడం లేదా ఇష్టానుసారంగా మార్చడం అంటే ఒక పౌరుడి ప్రజాస్వామ్య ఉనికినే ప్రశ్నార్థకం చేయడం. ఇది సాధారణ పరిపాలనా తప్పిదం కాదు; ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని ఆయన అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు షేక్ సలాహుద్దీన్, అన్ని నియోజకవర్గంలో జరిగిన అన్ని అక్రమ ఓటు మార్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా మార్చిన లేదా తొలగించిన ప్రతి ఓటును వెంటనే అసలు చిరునామాకు పునరుద్ధరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.

  • Related Posts

    బాధిత కుటుంబాల‌కు సీఎం విజ‌య్ భ‌రోసా

    చెన్నై : క‌రూర్ ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌న్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబర్ 27, 2025న విజయ్ ప్రసంగించిన టీవీకే (TVK)…

    ఏఎన్ఎం పోస్టుల మెరిట్ లిస్టు విడుద‌ల‌

    హైద‌రాబాద్ : తెలంగాణ వైద్య విజ్ఞాన ప‌రిష‌త్ , ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మొత్తం 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *