అమరావతి : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలలను స్థాపించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వందల సంఖ్యలో గురుకులాలు స్థాపించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామన్నారు. ఆరు ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కొత్తగా బీసీ హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఆర్వో పాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
తరగతి గదులు, విశ్రాంతి గదుల్లో దోమలు రాకుండా దోమ తెరలు అమర్చామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. డైట్ ఛార్జీల బిల్లులు 10 శాతం పెంచబోతున్నామని మంత్రి సవిత తెలిపారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలకు మరికొంత స్థలం కేటాయిస్తే ప్రభుత్వం తరఫున శాశ్వత భవనం కూడా సమకూర్చుతామని తెలిపారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల కళాశాలను రూ.కోటితో అభివృద్ధి చేసిన చిరుమామిళ్ల రాంబాబు, విజయలక్ష్మి దంపతుల సేవా నిరతిని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరుమామిళ్ల కుమార్తెను రాధను మంత్రి సవిత సత్కరించారు.





