తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్రమకోర్చి స్వామిని దర్శించుకునేందుకు పోటీ పడుతుంటారు. గత కొంత కాలంగా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. దీంతో విరాళాలు కూడా ఊహించని రీతిలో వస్తున్నాయి టీటీడీకి. తాజాగా టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60.61 లక్షలు విరాళంగా అందింది.
ఈ మేరకు వైజాగ్ కు చెందిన ఎస్ఎస్ఎన్ఆర్ ప్రోజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10.50 లక్షలు, శ్రీ విశ్వ సి.వి.చెరుకూరి అనే భక్తుడు రూ.10 లక్షలు, శ్రీ వంత ఇన్ ఫ్రా కాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షలు, వెర్టెక్స్ కౌంటీ ఎల్ఎల్పీ సంస్థ రూ.10 లక్షలు, హైదరాబాద్ కు చెందిన సాయిలీల ఎలక్ట్రికల్ ప్రోజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షలు, అమరావతిలోని తుళ్లూరుకు చెందిన జొన్నలగడ్డ కిరణ్ కుమార్ రూ.10,11,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు, శాప్ చైర్మన్ రవి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.







