హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంలో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్లో ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో ఆడిటోరియాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని ప్రసిద్ధ లింబాద్రి గుట్ట వద్ద టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేయించారు. దీనివల్ల ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఆర్మూర్లోని సిద్ధుల గుట్ట టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటకులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా జిల్లా పార్టీ శ్రేణులు, నేతలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి , ఇంచార్జీ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





