న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మంత్రులు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నమోదు చేసుకున్న రొయ్యల ఫీడ్ తయారీ సంస్థలకు మాత్రమే పరిమిత స్థాయిలో, తగిన నియంత్రణలతో 2021 నాటి విధానాన్ని అనుసరించి జన్యుమార్పిడి (GM) సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ చర్యల ద్వారా ఫీడ్ తయారీ వ్యయం తగ్గి రైతులకు ఉపశమనం కలగడంతో పాటు భారత రొయ్యల ఎగుమతుల పోటీతత్వం, విదేశీ మారకద్రవ్య ఆదాయం, లక్షలాది కుటుంబాల జీవనోపాధి రక్షించబడుతుందని తెలిపారు. అలాగే, పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి వినతిపత్రం సమర్పించారు. భారతదేశ ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, కూలీలు ఆధారపడి ఉన్నారని వివరించారు.
HS Code 2401 కింద ఉన్న అన్మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుకు RoDTEP పథకాన్ని వర్తింప జేయడంతో పాటు Interest Equalisation Scheme (NIRYAT PROTSAHAN) పరిధిలోకి తీసుకు రావాలని కోరారు. 2021-22లో భారత్ నుంచి ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులు 105.21 మిలియన్ కిలోలు, రూ.2,909.99 కోట్ల విలువ ఉండగా, 2025-26 నాటికి 155.05 మిలియన్ కిలోలకు, రూ.7,782.98 కోట్ల విలువకు పెరిగాయని తెలిపారు. జింబాబ్వే, బ్రెజిల్ వంటి దేశాలు తమ ఎగుమతిదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతిదారులు పోటీ పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా, పొగాకు రైతుల సంక్షేమం, ఆయా రంగాల స్థిరమైన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రుల బృందం స్పష్టం చేసింది.
ఈ సమావేశాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస రాజు, రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి శ్రవణ్ కుమార్, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, భరత్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పురందేశ్వరి, బీద మస్తానీ రావు తదితరులు పాల్గొన్నారు.





