హైదరాబాద్ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా అసంబద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వరిని సాగు చేస్తున్నారో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. తను పదే పదే రాజకీయ గురువు అని ప్రకటిస్తూనే మరో వైపు ఏపీకి లబ్ది చేకూర్చేలా ప్రయత్నం చేస్తుండడం దారుణమన్నారు. నిత్యం అబద్దాలు మాట్లాడుతూ పాలనా పరంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని ఆవేదన వ్యక్తం చేశారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
తెలంగాణలో ప్రస్తుతం ఎలినినో ప్రభావం ఉందంటూ పదే పదే రైతులు, ప్రజలను రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. తన దెబ్బకు పెద్ద ఎత్తున సాగు చేయకుండా వదిలి వేస్తున్నారని, దీని వల్ల రాబోయే రోజుల్లో పంటల సాగు లేకుండా పోతోందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే ఏపీలో కూడా ఉన్నాయని, మరి అక్కడ ఎందుకు వరి సాగు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. నీరు ఎలాగూ ఎగువ ప్రాంతం నుండి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తుంది కదా? నీరు ఏదో ఒక విధంగా తమకు వస్తుందనే నమ్మకం ఆంధ్ర ప్రజలకు ఉందని, అందుకే వారు వరిని సాగు చేశారని మాజీ మంత్రి అన్నారు.
తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలకే రేవంత్ రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉందని, ఎందుకంటే, ఆయన ఏదో ఒక విధంగా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తారని వారికి తెలుసన్నారు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే, 4 టీఎంసీల నీరు దిగువకు ప్రవహిస్తుందని, ఈ నీళ్లతో అక్కడ 40 వేలకు పైగా ఎకరాలలో వరిని సాగు చేస్తారన్నారు.





