వారు ఫ్యాక్షన్ తెస్తే మేం ఫైటర్ జెట్లు తెస్తున్నాం

అమరావతి : సైకో జగన్ రెడ్డి హయాంలో రాయలసీమలో గొడ్డలి రాజ్యమేలిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి నారా లోకేష్. అంతకు ముందు సొంత బాబాయిని లేపేసి నెపం మనపై వేశారన్నారు. ఫలితంగా ఓటమి పాలయ్యాం అన్నారు. మన హయాంలో జొన్నగిరి గోల్డ్ పరిశ్రమ తెచ్చాం అని పేర్కొన్నారు. వారి హయాంలో బ్రహ్మణి స్టీల్స్ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ కడప స్టీల్ ప్లాంట్ పనులను వేగంగా పరుగెత్తిస్తున్నాం అన్నారు. వారి హయాంలో సీమలో రక్తం పారిస్తే, మనం మిషన్ రాయలసీమ ద్వారా సస్యశ్యామలం చేస్తున్నాం అని పేర్కొన్నారు నారా లోకేష్. వారి హయాంలో ఫ్యాక్షన్ తెస్తే, మన హయాంలో ఫ్యాక్టరీలు, ఫైటర్ జెట్ లు, రాయల్ ఎన్ ఫీల్డ్ తెస్తున్నాం అని వెల్లడించారు.
రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్. రాయలసీమ ప్రజలు ఎక్కువగా బిందు సేద్యంపై ఆధార పడ్డారు. దీనిని గమనించి 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే, సైకో హయాంలో సబ్సిడీలు రద్దు చేశారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే ఆ కుటుంబాలను కనీసం పరామర్శించ లేదన్నారు నష్టపరిహారం అందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్ రాజా, జాకీ లాంటి పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మళ్లీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. గతంలో జరిగిన విధ్వంసాన్ని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత కారకర్తలపై ఉందన్నారు. డోర్ టు డోర్ కార్యక్రమానికి మెటీరియల్ ఇచ్చాం అన్నారు. ప్రతిరోజు 30 ఇళ్లకు వెళ్లండి. మనం చేసిన మంచి పనిని ప్రజలకు చెప్పండి. వాళ్లు అడిగింది రాసుకోండి. మై టిడిపి యాప్ ద్వారా ప్రజలు ఏం చెప్పారో తెలియ జేయండి అని కోరారు నారా లోకేష్.