కరీంనగర్ జిల్లా : బ్యారేజీలను ‘ఫ్రీ-ఫ్లో’ (నీరు స్వేచ్ఛగా ప్రవహించే) స్థితిలో ఉంచడంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సమగ్ర దర్యాప్తు , మరమ్మతులు పూర్తయ్యే వరకు నీటి నిల్వను నిషేధించే NDSA , CWC ఆదేశాలను ప్రభుత్వం కఠినంగా పాటిస్తోందని అన్నారు. జూన్ 30న ఏర్పాటు చేసిన కేంద్ర సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఐఐటి బొంబాయి , AFRY ఇండియా పునరుద్ధరణ డిజైన్ను సిద్ధం చేస్తున్నాయని తెలిపారు. ఇది 2-3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు మంత్రి.
ప్రతిపాదిత చర్యలలో పునాదులను బలోపేతం చేయడానికి డయాఫ్రమ్ గోడ నిర్మాణం , స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ ఉన్నాయన్నారు. డిజైన్లు ఖరారైన తర్వాత మరమ్మతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు మంత్రి, వచ్చే రుతుపవనాలకు ముందే బ్యారేజీలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని చెప్పారు. కన్నెపల్లి పంపులను ఇంకా ఎందుకు పని చేయించలేమో వివరించే ప్రయత్నం చేశారు .అక్కడి నుండి తోడిన నీటిని ముందుగా అన్నారం, సుండిల్లాలో నిల్వ చేయాల్సి ఉంటుందని, ఈ రెండూ నిర్మాణపరమైన పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అసలు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక నుండి విచలనం చెందిన సెకెంట్ పైల్ ఫౌండేషన్ వ్యవస్థలో నిపుణులు తీవ్రమైన లోపాలను గుర్తించామన్నారు.
పార్టీలు తప్పుడు ప్రచార హోరు నడుపుతున్నాయని, కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటికి క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం సాగునీటిపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, కొత్త ఆయకట్టును చాలా తక్కువగా ఏర్పాటు చేసిందని ఆయన ఎత్తి చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా లక్ష ఎకరాలకు స్థిరమైన సాగునీటిని అందించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి వంటి అనేక ఇతర ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలి పోయాయి.






