హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు పెంచింది. ఇప్పుడు అన్నీ తానై చూసుకుంటోంది. ఇందులో భాగంగా నగరంలో పలు పనులు పర్యవేక్షణ చేసేందుకు గాను కొత్తగా సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైడ్రాలో 100 మంది DRF అసిస్టెంటెంట్లతో పాటు 50 మంది డ్రైవర్ ఉద్యోగాల నియామకాన్ని హైడ్రా చేపట్టింది. సరూర్ నగర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియను హైడ్రా నిర్వహించింది. వేలాది మంది రావడంతో వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం, ఫిజికల్ టెస్టు కోసం టోకెన్లు జారీ చేయడంలో ఇబ్బంది తలెత్తింది. ఒకేసారి వేలాది మంది ముందుకు రావడానికి ప్రయత్నించగా వారిని నియంత్రించడంలో ఓ అధికారి అసహనానికి గురై పరుషంగా మాట్లాడడం తర్వాత సర్ది చెప్పడం జరిగింది.
యువత కూడా అర్థం చేసుకొని సహకరించడంతో ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. ఈ నెల 8, 9 తేదీల్లో సరూర్ నగర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని హైడ్రా ఇదివరకే మీడియా ద్వారా ప్రకటన ఇచ్చింది. దీంతో 3 వేల మందికి పైగా వచ్చారు. ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా పోలీసుల సహకారంతో అధికారులు నియంత్రించారు. మొదట్లో కాస్త ఇబ్బంది ఎదురైనా అందరి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామని, అందరికీ శారీరక పరీక్షలకు అవకాశం కల్పిస్తామని పదేపదే లౌడ్ స్పీకర్లలో అనౌన్స్ చేయడంతో యువత అర్థం చేసుకొని నియామక ప్రక్రియకు సహకరించింది.






