ధర్మపురం అరవింద్ ఆరోపణలు అబద్దం : డీజీపీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా నిజామాబాద్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురం అరవింద పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా తన కదలికలను ఖాకీలు పరిశీలిస్తున్నారని, ఈ విషయంపై తనకు అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై డీజీపీ విచారణ చేపట్టాలని , అంతే కాకుండా నిజామాబాద్ జిల్లా పోలీసులపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎంపీ. ఇందుకు సంబంధించి సామాజిక వేదికగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్. ఈ మేరకు మంగళవారం డీజీపీ ఇదే ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురం అరవింద్ చేసిన ఆరోపణలు పూర్తిగా సత్య దూరమని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు సీవీ ఆనంద్. ఆరోపణలపై విచారణ చేశామని, తమ దర్యాప్తులో అది అవాస్తవమని నిర్ధారణ చేసుకున్నట్లు స్పష్టం చేశారు. సంబంధిత వర్గాల ద్వారా వాస్తవాలను నిర్ధారించుకోవడానికి నేను తగిన సమయం తీసుకుని, పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. మిమ్మల్ని అనుసరించడానికి లేదా మీ కదలికలపై నిఘా ఉంచడానికి ఏ అధికారిని కూడా నియమించలేదని నొక్కి చెప్పారు డీజీపీ . అటువంటి పద్ధతులను తాము నమ్మమమని, ఆచరించే ప్రసక్తి లేదన్నారు. అయినప్పటికీ మీ వద్ద ఏవైనా అదనపు వివరాలు ఉంటే దయచేసి వాటిని నాకు నేరుగా తెలియ చేయాలని కోరారు సీవీ ఆనంద్.