ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీం ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మహిళలకు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలలో భాగంగా మహిళల సాధికారత కోసం ఉద్దేశించిన కొత్త పథకం ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించింది. ప్రధానంగా పేద మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం “ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకంషను తీసుకు వచ్చింది. ఈ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ ఆర్థిక సంస్థ (BC Finance Corporation) ద్వారా అమలు చేస్తున్నారు.
దీనికి అర్హత వయస్సు 18 నుండి 55 ఏళ్లుగా నిర్ణయించారు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం లేదా కుల ధృవీకరణ పత్రం. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయ పరిమితి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలుగా ఉండాలి. అర్హులైన అభ్యర్థులు TGOBMMS పోర్టల్ (http://tgobmms.cgg.gov.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 15. మరిన్ని వివరాల కోసం సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ అధికారిని లేదా బీసీ కార్పొరేషన్ను సంప్రదించాలని అభ్యర్థులకు సూచించింది తెలంగాణ ప్రభుత్వం.