ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యధేశ్చగా కృష్ణా జలాలు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. ఆయన ఆధారాలతో సహా కృష్ణా జలాల తరలి పోవడం బయట పెట్టారు. దీనికి కాంగ్రెస్ సర్కార్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యానికి ఏపీ వైపు నిండుగా పారుతున్న ఈ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం అన్నారు. కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏపీకి పట్టింపు లేదన్నారు. చేతగాని సీఎం ఉంటే ఒక రాష్ట్రం ఎలా నష్టపోతుందో కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం అన్నారు హరీశ్ రావు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై మరోసారి ఏపీ అధికారులు దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న సాగర్ డ్యామ్ నుంచి కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఏపీ వైపు కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు.
ఏపీ 47 టీఎంసీల నీటిని కోరింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశమే వాయిదా పడింది. నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం రాకముందే ఏపీ అధికారులు నీటిని తరలించడం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు. కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా నీటిని తీసుకెళ్లేంత ధైర్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా నీటిని తరలించే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ ఎందుకు మౌనంగా ఉంటోందని సీరియస్ అయ్యారు. అసలు ఇంత జరుగుతుంటే తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. ఒకవైపు శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్ ద్వారా 11 టీఎంసీల నీటిని తరలించారని ఆరోపించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారని అన్నారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలా ఇష్టారీతిన నీటిని తరలించడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు .గత రెండేళ్లుగా కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటాను సైతం వినియోగించుకోలేక మన నీళ్లను ఏపీకి ధారాదత్తం చేశారని అన్నారు.