అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు.హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురషోత్తమ్ కుమార్ చింతలపూడిలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నియామకాలతో ఏపీ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు చేరింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్తవంతంగా నిర్వహిస్తామని, న్యాయం అందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.















