హైదరాబాద్ : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేదన్నారు. తనపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పేపర్ కాకుండా పక్క పేపర్ లో నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు ప్రేమ్ సాగర్ రావు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలి పెట్టనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో కుట్రలు అన్ని బయటకు వస్తాయన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
తాను 450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని అన్నారు. 2009-10లో బ్యాంక్ 450 కోట్లు సాంక్షన్ చేసిందని తెలిపారు. సాయినాథ్ ప్రయివేట్ లిమిటెడ్ పై, భాగ్యనగర్ హోటల్స్ పేరుమీద బ్యాంక్ లోను తీసుకున్నాం అని చెప్పారు ప్రేమ్ సాగర్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా నేను 15 స్కూల్స్ కట్టించాననని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని పేర్కొన్నారు. నేను సాండ్, లాండ్ తీసుకోవాలని అనుకుంటే అప్పుడే తీసుకునే వాణ్ణి అని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని అన్నారు. పది ఏండ్లు ప్రతి పక్షంలో ఉండి కాంగ్రెస్ కోసం పోరాటం చేశానన్నారు. నిజానిర్ధారణ కమిటీ వేస్తే కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తానని ప్రకటించారు.





