గోదావరి జలాలతో రైతులకు శాశ్వత నీటి సరఫరా
ములుగు జిల్లా : పరిస్థితులు ఏవైనప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్బంగా చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సుమారు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇందులో దాదాపు 92 శాతం ఆయకట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా, మిగిలిన భాగం నల్గొండ జిల్లా వరకు విస్తరించి ఉందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూస్తూ, పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం, పంపింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో పనిచేసేలా చేయడం, 38.16 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించు కోవడం, 22 రిజర్వాయర్లను పూర్తి సామర్థ్యంతో నింపడం, దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడం ముఖ్యమన్నారు. గోదావరి జలాలతో రైతులకు శాశ్వత భరోసా కల్పించడం ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. సాగునీరు , తాగునీటి అవసరాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది, అలాగే ‘ఎల్ నినో’ (El Niño) పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా తగిన చర్యలు చేపడుతోందని అన్నారు.
రీడిజైనింగ్ పేరుతో… గ్రామాలు, పేర్లు, అంచనాలను మార్చి, రైతులకు సాగునీరు అందించాలనే నిజాయితీ లేని ఉద్దేశంతో కేవలం అవినీతి కూపంగా మార్చడానికే BRS పాలకులు ప్రాజెక్టులను నిర్మించారు. అందుకే, దేవాదుల పూర్తయితే తమ బ్రాండ్ ఇమేజ్ పోయి కాంగ్రెస్ పేరు వస్తుందనే భయంతో… కుటిల రాజకీయ కుట్రల ద్వారా దేవాదుల ఆయకట్టు రైతులను వారు మోసం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు “నేనే కర్త, కర్మ, క్రియ” అని గొప్పలు చెప్పుకుంటూ ఆ ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్ , ఇప్పుడు కరువును తీవ్రతరం చేసి రైతులను రెచ్చగొట్టేలా విషపూరిత పాములను పెంచుతున్నారని ఆరోపించారు. ఆయన అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరణ ఇవ్వాలి. వారు నిర్మించి, తమ హయాంలోనే కుప్పకూలిన ప్రాజెక్టులలో జరిగిన అవినీతిపై… రోజుకో అంశం చొప్పున, ప్రతి స్తంభం (pillar) గురించి చర్చించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.