కోల్ కతా : తాను ఏనాడూ ఎవరికీ తలవంచిన దాఖలాలు లేవన్నారు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీదీ నేతృత్వంలో ఈరోజు కోల్కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు తరలి వచ్చారు. అక్కడ ఉత్సాహ భరితమైన వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా అశేష ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. రాజకీయాలలో ఒడిదుడుకులు సహజమని పేర్కొన్నారు. తాను ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తూనే ఉంటానని ప్రకటించారు. అధికారం అన్నది తాత్కాలికమని, ప్రజలు , ఈ ప్రాంతం శాశ్వతమని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.
కేంద్రంలోని మోదీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఎలా తనను వేధింపులకు గురి చేస్తూ ఉన్నదో మీరు చూస్తూనే ఉన్నారని అన్నారు. ప్రజలు అన్నీ గుర్తు పెట్టుకుంటారని, తిరిగి తమను ఆదరించే రోజు తప్పకుండా వస్తుందని ప్రకటించారు దీదీ. ఏనాడూ తాను , తన పరివారం అధికారం కోసం పాకులాడ లేదని అన్నారు. అధికార దుర్వినియోగం చేయలేదన్నారు. ప్రజాదరణ ఎల్లప్పటికీ ఉంటుందని, పవర్ ముఖ్యం కాదన్నారు మమతా బెనర్జీ. ఒక రకంగా చెప్పాలంటే ఆమెది ఉక్కు మహిళ గర్జన వంటిది. కరుణామయి, ఉగ్ర స్వభావం గల, ప్రజాక్షేత్రంలో తన రాజకీయాలను నిర్మించుకున్న భారతదేశపు చివరి గొప్ప ప్రజా నాయకురాళ్లలో మమతా బెనర్జీ ఒకరు.
ఆమెకు ఎన్నడూ ప్రచార శీర్షికలు, ఫోటో సెషన్లు, పీఆర్ ఈవెంట్ మేనేజ్మెంట్ అవసరం రాలేదు. ఆమె తుఫాను మధ్యలో నిలబడి, ధైర్యంగా ఉండటం అంటే ఏమిటో మనందరికీ నేర్పుతున్నారు.






